శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలుజిల్లా - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Monday 1 January 2018

శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలుజిల్లా

శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలుజిల్లా, ఆంద్రప్రదేశ్
*************************
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’.

యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది వినే వుంటారు. కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు.. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని తెలుసు. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో వున్నాయి.
యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై వుంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్దపెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ వుంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు వుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది.
అగస్త్య పుష్కరిణి
****************
యాగంటి ఉమామహేశ్వరాలయంలో వున్న పుష్కరిణికి ‘అగస్త్య పుష్కరిణి’ అనే పేరు వుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని చెబుతారు
బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన గుహ
************************************
పర్వతం మీద వున్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో వున్న ఉమా మహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే వుండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తూ వుంటారు.
యాగంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో వుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం వుంటుంది. యాగంటిలో వసతి సదుపాయం వుండదు. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి వుంటుంది. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి అది

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here