మహ పుణ్యక్షేత్రం - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Monday 11 December 2017

మహ పుణ్యక్షేత్రం

* నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన మహ పుణ్యక్షేత్రం...
* మహా మహిమాన్విత మైన నవనందుల క్షేత్రలు...
* నవనందుల దర్శనం ... సర్వ పాపహరణం....
* శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం ....
* నవనందుల దర్శనం అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరి జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు .... 
.
.
మన దేశంలో నెలకొన్న అనేకానేక ఆలయాలలో ప్రధాన అర్చనామూర్తి తో పాటు ఉప దేవతలు ఎందరో కొలువు తీరి ఉంటారు. అందరినీ సందర్శించి సేవించుకోవడం శుభప్రదంగా భావిస్తారు భక్త జనం. కానీ ఒకే దైవం ఒక ప్రాంత పరిసరాలలో లేదా కొన్ని పవిత్ర ప్రదేశాలలో ఒకే కారణంతో లేదా ప్రత్యేక విశేషంతో కొలువై ఉండిన దివ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. 
.
అష్ట వీరట్ట క్షేత్రాలు, సప్త మాంగై స్థలాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు, నవ కైలాసాలు, పంచ పాండవ ఆలయాలు, పంచ ధర్మశాస్త ఆలయాలు లాంటివి తమిళనాడు మరియు కేరళలోనెలకొని ఉండగా పంచారామాలు, పంచ భావన్నారాయన, పంచ శ్రీ వల్లభ క్షేత్రాలు, పంచ నారసింహ ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. 
.
శివుడి వాహనమైన నందీశ్వరుడు ఆయనని చూడకుండా క్షణమైనా ఉండలేడు. అందుకే శివయ్య ఎక్కడ వెలసినా నంది ఆయనను చూస్తూ ఎదురుగానే బుద్ధిగా కూర్చుని కనిపిస్తుంటాడు. తనకి శివుడికి మధ్యలో భక్తులు ఏ మాత్రం అడ్డొచ్చినా ఆయన మహా బాధపడిపోతాడు. ఈ కారణంగానే భక్తులు ముందుగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుని, ఆ తరువాత శివయ్యని దర్శిస్తూ వుంటారు.
.
అలా శివయ్యను కనిపెట్టుకుని వుండే నంది పేరున వివిధ క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. అలాంటి వాటిలో 'నవనందులు' విశిష్టమైనవిగా అలరారుతున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన 'మహా నంది'తో పాటు అక్కడికి దగ్గరలో వున్న మిగతా ఎనిమిది నంది క్షేత్రాలను కలుపుకుని 'నవనంది క్షేత్రాలు'గా పిలవబడుతున్నాయి. ఇవన్నీ నంది పేరునే కనిపిస్తున్నప్పటికీ ఆయన శివుడితో కలిసే ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు.
.
పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుని కుటుంబం లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది. పార్వతి దేవి కి పులి, వినాయకునికి మూషికం, కుమారస్వామి కి నెమలి మరియు శివునికి నంది వాహనంగా ఉంటుంది. అన్నింటిలోకీ నంది ప్రత్యేకమైనది. నందిని పూజిస్తే పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) ఆపద ముద్రరూపంలో వెలిశాడు! ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం...! 
.
నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 
.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల పరిధిలో నేకొని ఉన్న నవ నందులు విశేష పౌరాణిక మరియు చారిత్రిక కలిగినవిగా పేర్కొనవచ్చును. 
.
క్షేత్ర చరిత్ర ... స్థలపురాణం:..
పూర్వీకులు తెలిపిని కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని(శిలాద మహర్షి) పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై... కావల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని.. మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.
.
చరిత్ర ప్రకారం:.. 
పూర్వం నందుడు అనే రాజు పాలనలో గోపితవరం( నేటి గోపవరం) గ్రామంలో ఓ గొల్లవానికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులోని కపిల అనే విశిష్టమైన ఆవు ఈ నల్లమల అడవిలో పచ్చిగడ్డి మేస్తూ ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి.. రోజూ పాలు ఇస్తూ ఆయన ఆకలి తీర్చేది.ఓ గోమాత రోజూ అడవిలోని ఒకపుట్టలో పాలు విడుస్తోందన్న విషయం నందమహారాజుకు గూఢచారుల ద్వారా తెలిసి.. ఆయన ఆ వింతను కళ్లారా చూడాలని అక్కడికి వస్తాడు. కపిల గోవు పొదల్లోకి వెళ్లి పుట్టవద్ద నిలిచి పాలధారను స్రవిస్తుండగా.. చూసి.. రాజు మరింత స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూసేందుకని ముందుకు కదలగా... ఆ అలికిడికి బెదిరిన ఆవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది. ఆపై.. పుట్టలోని బాలరూప శివుడు.. ఆ గోమాత కూడా మాయమైపోగా.. రాజు ఎందుకలా అయ్యిందో అర్థం కాక... అయోమయంగా తిరిగి నగరికి చేరతాడు. ఆరాత్రి అతనికి పరమశివుడు కలలో కనిపించి ‘ నీవు చూసిన పుట్టనుంచి పాలు తాగింది నేనే. అక్కడ దేవాలయాన్ని నిర్మించు... నేనక్కడ లింగరూపినై కొలువుంటా.. నీ కీర్తి శాశ్వతం అవుతుందని చెప్పాడు. ఆ మేరకు నందరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని రససిద్ధుడు అనే దేవలోక శిల్పి రూపొందించినట్లుగా పురాణగాథ. అన్ని చోట్లా పానవట్టంపై శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ పానవట్టమే శివలింగానికి అమర్చినట్లుగా కనబడటం మహానంది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
.
రాజుల చరిత్ర:...
నందరాజు ఈ ప్రాంతాలను (నందవరం, నంద్యాల, నందికొట్కూరు, మహానంది)ని పాలించాడు. క్రీ.పూ. 323లో మౌర్య చంద్రగుప్తుడు వీరిని ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు. పాండవ వంశీయుడైన ఉత్తుంగ భోజుని కుమారుడైన నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతడే కథాకాలం నాటి నంద మహారాజు. వెలనాటి చోళులల్లో విక్రమభోజుడు క్రీ.శ. 1118 నుంచి 1135 వరకు మహేంద్రగిరి(గంజాం) శ్రీశైలం మధ్యగల పర్వత ప్రాంతాలన్నింటినీ పరిపాలించాడు. అతను కూడా ఈ క్షేత్రానికి వచ్చి పరమశివుడిని పూజించి ఆలయ గోపురాలు, కొన్ని కట్టడాలు, మండపాలు నిర్మించి క్షేత్రాభివృద్ధికి దోహదం చేశాడు. ఆ తర్వాత విజయనగర రాజులు సైతం కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు.. రహదారులు ఏర్పాటు చేసి శివుడిని ఆరాధించారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల భక్తులు వస్తుంటారు.
.
నీటికొలనులు:..
బ్రహ్మగుండం, రుద్రగుండం, విష్ణుగుండం ఉన్నాయి. ఇందులో రుద్రగుండంనుంచి రెండు ధారలు బయటికి ప్రవహిస్తుంటాయి. ఈ నీటి ద్వారా పరిసర ప్రాంతాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో అరటితోటలు సాగవుతున్నాయి.
.
రుద్రగుండంలో పంచలింగాల మండపం: ఇందులో పృథ్వీ(భూ)లింగం, జలలింగం, తేజో(అగ్ని)లింగం, వాయు లింగం, ఆకాశ లింగం ప్రతిష్ఠించారు.
.
ఈ నవ నంది యాత్రకు బయలుదేరే ముందు నంద్యాల పట్టణంలోని "శ్రీ సాక్షి మల్లిఖార్జున స్వామి" కి మొక్కి ఆరంభించాలని అంటారు. రెండు వేల సంవత్సరాల క్రిందటి నిర్మాణంగా పేర్కొనే ఈ ఆలయం చాలాకాలం భూమిలో ఉండిపోయి కొన్ని సంవత్సరాల క్రిందట స్థానిక భక్తుల శ్రమదానంతో సంతరించి కొన్నది. స్వామి వారితో పాటు శ్రీ భ్రమరాంబ దేవికి, నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన హరిహర పుత్ర శ్రీ ధర్మ శాస్త ని పూజించి యాత్ర ఆరంభిస్తారు భక్తులు. 
.
"ప్రధమ లేదా పద్మ నంది":..
నందుల్లో మొదటిది ప్రధమ లేదా పద్మ నంది ఇది చామకాల్వ ఒడ్డున, రైల్వే స్టేషన్ కు బస్సు స్టాండ్ కు సమ దూరంలో కర్నూల్ రోడ్ లో ప్రధాన రహదారి కి కొద్దిగా లోపలికి ఉంటుందీ ఆలయం. సృష్టి కర్త బ్రహ్మ దేవుడు పరమేష్టి దర్శనాభిలాషతో ఇక్కడ తపస్సు చేసి సాక్షాత్కారం పొందారట. ముఖ మండపంలో ఉన్న పెద్ద నంది తల మీద పేరుకు తగినట్లుగా పెద్ద పద్మం చెక్క బడి ఉంటుంది. విఘ్ననాయకుడు, శ్రీ ప్రధమ నందీశ్వరుడు, శ్రీ కేదారేశ్వరి దేవి మూడు సన్నిధులలొ కొలువు తీరి కనపడతారు. నవ గ్రహ మండపం, శ్రీ ఆంజనేయ, శ్రీ గాయత్రీ మాత, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయాలు ఉంటాయి. పడమర దిశలో నిర్మించబడిన ఈ ఆలయంలో ఒక నిర్మాణ చాతుర్యం కార్తీక మాసంలో ఆవిష్కారమవుతుంది. పరమేశ్వర ప్రియ మాసంలో ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా లింగాన్ని తాకుతాయి ఇక్కడ విశేషం.
.
నాగ నంది:..
నంద్యాల బస్సు స్టాండ్ దగ్గరలోని శ్రీ ఆంజనేయ సమేత కోదండరామ స్వామి ఆలయంలో కొలువై ఉంటారు. శ్రీ వారి వాహనమైన గరుడుని బారి నుండి తమను కాపాడమని నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు స్థలంగా పేర్కొంటారు. శ్రీ నాగ నందీశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక్కడ ప్రధాన అర్చనా మూర్తి శ్రీ హనుమంతుడు. శ్రీ కృష్ణ దేవరాయల గురువైన శ్రీ వ్యాసరాయల ప్రతిష్టిత వాయు నందనుని విరాట్ రూపం రమణీయ అలంకరణతో నేత్ర పర్వంగా ఉంటుంది. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం కూడా నెలకొల్పారు. 
.
సోమ నంది:...
సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (ఆల్మోస్ట్ నంద్యాల పట్టణానికి లోపల) జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.
.
సూర్య నంది:..
పట్టణంలోని ఆత్మకూరు బస్సు స్టాండ్ దగ్గరలోని శ్రీ జగజ్జనని మాత ఆలయానికి చేరువలో ఉంటుంది. మామ గారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప ప్రభావం తగ్గించు కోడానికి చంద్రుడు ఇక్కడ తపస్సు చేశారన్నది స్థల పురాణం. అనుగ్రహించి అతనిని తన శిరస్సున ఉంచుకొని చంద్ర శేఖరునిగా కీర్తించబడుతున్నారు. 
నంద్యాలకు మహానందికి మధ్యలో తుమ్మెద పల్లి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సూర్య నంది ఆలయం. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు సర్వేశ్వర దర్శనాన్ని అపేక్షిస్తూ తపస్సు చేసిన స్థలమిది. ప్రతి నిత్యం
ఉదయాన్నే తోలి కిరణాలతో శ్రీ సూర్య నందీశ్వర స్వామిని అభిషేకిస్తారు ఆదిత్యుడు. 
.
శివ లేదా రుద్ర నంది:...
శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ప్రశాంత అటవీ వాతావరణం లో ఉండే రుద్ర లేదా శివ నంది ఆలయంలో పురాతన నిర్మాణాలు, శాసనాలు కనపడతాయి. 
.
విష్ణు లేదా కృష్ణ నంది:..
మహానంది రోడ్డు మార్గంలో, మహానంది ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు ఆలయం కనిపిస్తుంది. శ్రీ మహా విష్ణువు శ్రీ పమేశ్వరుని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, సుందర ప్రకృతి. స్వచ్చ జలాలతో పుష్కరణి. అనేక పురాతన మండపాలు. నిలువెత్తు పాలరాతి నంది విగ్రహం అన్నీ అద్భుతంగా ఉంటాయి. 
.
గరుడ నంది:..
నంద్యాల నుండి మహానందికి వెళ్ళటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు దాస్య విముక్తి కలిగించ దానికి దాయాదులైన నాగులు కోరిన అమృత భాండం తేవడానికి వెళ్ళడానికి సిద్ద పడ్డాడు గర్త్మంతుడు. తల్లి వినత సలహా మేరకు తన ప్రయత్నం విజయవంతం కావాలని నంది వాహనుని అనుగ్రహం కొరకు గరుడుడు ప్రార్ధించిన స్థలమిది అని చెబుతారు. 
.
మహానంది:..
మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగితేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికంగా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుతుంది.
.
వినాయక నంది:..
వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.
.
ఎలా చేరుకోవాలి ? వాయు మార్గం నంద్యాలకు సమీపాన కడప విమానాశ్రయం 126 కి. మీ దూరంలో కలదు. 273 కి.మీ. దూరంలో శంషాబాద్ ఏర్ పోర్ట్ కూడా ఉన్నది. అక్కడి నుండి ప్రజారవాణా ద్వారా సమీప ప్రధాన బస్ స్టాండ్ లకు వెళ్ళి నంద్యాల చేరుకోవచ్చు. రైలు మార్గం నంద్యాల లో రైల్వే స్టేషన్ ఉన్నది. హైదరాబాద్, గుంతకల్(163 కి.మీ), బెంగళూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్(669 కి.మీ) ల నుండి నిత్యం రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం హైదరాబాద్(296 కి.మీ), విజయవాడ(322 కి.మీ), గుంటూరు(286 కి.మీ), కడప(129 కి.మీ), తిరుపతి(269 కి.మీ), కర్నూలు(74 కి.మీ), బెంగళూరు(394 కి.మీ) నగరాల నుండి నంద్యాలకు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఎల్లవేళలా తిరుగుతుంటాయి. 
.
నంద్యాల నుండి ఆటో లేదా ఏదేని ట్రావెల్ ను మాట్లాడుకోని 14 కి.మీ. దూరంలో ఉన్న మహానంది క్షేత్రం తో పాటుగా, మిగిలిన ఎనిమిది నందులను దర్శించుకోవచ్చు. నా ఉచిత సలహా ఏంటంటే, ట్రావెల్ కంటే ఆటోనే బెటర్. ఎందుచేతనంటే కొన్ని నందులు సందుల్లో ఉంటాయి, మరికొన్ని పల్లెటూర్లలో ఉంటాయి. అక్కడికి ఆటోలైతేనే వెళ్ళగలవు....

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here